Chamala Kiran Kumar Reddy: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుద్ది, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు చామల కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ మేనేజ్మెంట్ కోటాలో రాజకీయాలకు వస్తే.. రేవంత్ రెడ్డి మెరిట్ కోటాలో తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. కేటీఆర్ మేనేజ్మెంట్ కోటాలోనే సిరిసిల్ల ఎమ్మెల్యే అయ్యారని.. తర్వాత మంత్రి అయ్యారని వ్యంగాస్త్రాలు సంధించారు.
రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్గా జడ్పీటీసీ, ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా.. ఒకసారి ఎంపీగా గెలిచిన తర్వాత ఇప్పుడు సీఎం అయ్యారని తెలిపారు. తెలంగాణ ప్రజలకు మెరిట్ కోటా,పేమెంట్ కోటా, మేనేజ్మెంట్ కోటా ఎవరిదో బాగా తెలుసునన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. ఎప్పుడు అధికారం తమకే ఉంటుందని బీఆర్ఎస్ హయాంలో నియంత పాలన చేశారని గుర్తుచేశారు.
రేవంత్ రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించి ఇంటికి సాగనంపారని పేర్కొన్నారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి చేతిలో బీఆర్ఎస్ పార్టీకి భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు. దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ స్వీకరించాలంటూ కేటీఆర్కు సవాల్ విసిరారు. కేటీఆర్ను ఐరెన్ లెగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని అభివర్ణించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గుండు సున్నా వచ్చిందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసింది తామే అని చెప్పుకున్న కేటీఆర్ను కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఓడగొట్టారని గుర్తు చేశారు.
Also Read: Harish Rao: రాజకీయాల కోసం తెలంగాణ పరువు తీయొద్దు: హరీశ్ రావు
పిచ్చి ఆలోచనలు మానుకోవాలంటూ కేటీఆర్కు ఆయన హితవు పలికారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాలంటూ బీఆర్ఎస్ నేతలకు ఆయన సూచించారు. కేసీఆర్ను అసెంబ్లీకి తీసుకుని రావాలంటూ కేటీఆర్కు హితవుపలికారు. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే ప్రధాన ప్రతిపక్ష నేత హోదాను కేటీఆర్ తీసుకోవాలని సూచించారు. తద్వారా ప్రభుత్వానికి సలహాలు,సూచనలు ఇవ్వాలని కేటీఆర్కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు.
తాను బూతులు మాట్లాడతానంటూ కేటీఆర్ అంటున్నారన్నారు. కట్టే, కొట్టే, తెచ్చే అనేది కేటీఆర్ కుటుంబానికి వర్తిస్తుందన్నారు. తెలంగాణ ప్రజలను నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో మీరు వంచించ లేదా..? అని కేటీఆర్ను సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ ఉద్యమకారుడి అవతారం ఎత్తి, పిట్ట కథలు కట్టి, సీఎం పదవిని అధికారాన్ని చేపట్టి.. రాష్ట్రాన్ని అప్పుల చేసి మీ కుటుంబానికి సంపద తెచ్చారని విమర్శించారు.

