Telangana: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పుల్లో భాగంగా నల్గొండ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి ఇలా త్రిపాఠి (2017 బ్యాచ్) బదిలీ అయ్యారు. ప్రభుత్వం ఆమెను నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా నియమించింది. నిజామాబాద్ కలెక్టర్గా ఉన్న శ్రీ టి.వినయ్ కృష్ణారెడ్డి (2013 బ్యాచ్) బదిలీ కావడంతో ఆ స్థానంలో ఇలా త్రిపాఠి బాధ్యతలు స్వీకరించనున్నారు. బదిలీ అయిన వినయ్ కృష్ణారెడ్డిని జీహెచ్ఎంసీ (GHMC) అదనపు కమిషనర్గా ప్రభుత్వం నియమించింది. ఆయన జీహెచ్ఎంసీ పరిధిలోని మల్కాజిగిరి, ఎల్బీనగర్, ఉప్పల్ జోన్ల బాధ్యతలను పర్యవేక్షిస్తారు.
నల్గొండ జిల్లా నూతన కలెక్టర్గా శ్రీ చంద్రశేఖర్ బడుగు (2018 బ్యాచ్) నియమితులయ్యారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా ఉన్న ఆయన, పదోన్నతిపై నల్గొండ జిల్లా పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. వీటితో పాటు ఇతర జిల్లాల్లోనూ మార్పులు జరిగాయి. వికారాబాద్ జిల్లా తాండూరు సబ్-కలెక్టర్గా పనిచేస్తున్న శ్రీ ఉమాశంకర్ ప్రసాద్ (2022 బ్యాచ్) ను నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గా ప్రభుత్వం నియమించింది.

