MEA On Violence in Bangladesh: పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో ఇటీవల మైనారిటీలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. మైనారిటీలపై జరుగుతున్న హింసను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బంగ్లాదేశ్లోని మైమెన్సింగ్లో ఇటీవల జరిగిన హిందూ యువకుడి దారుణ హత్యను ఖండిస్తున్నట్లు తెలిపారు. బంగ్లాదేశ్లో హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు సహా మైనారిటీలపై కొనసాగుతున్న శత్రుత్వం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు.
బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరిగిన హింసాత్మక సంఘటనలను రాజకీయ హింసగా తోసిపుచ్చలేమని ఆయన అన్నారు. తాత్కాలిక ప్రభుత్వ హయాంలో బంగ్లాదేశ్లో మైనారిటీలపై 2,900 కి పైగా హింసా సంఘటనలు జరిగినట్లు స్వతంత్ర వర్గాలు నమోదు చేశాయని ఆయన అన్నారు. ఇక బీఎన్పీకి చెందిన తారిఖ్ రెహమాన్ తిరిగి రావటంపై ఆయన స్పందించారు. బంగ్లాదేశ్లో స్వేచ్ఛా యుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికలకు భారతదేశం మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు.

